నా కోసం సుపారీ గ్యాంగులు బరిలోకి దిగాయి.. పవన్ సంచలన ఆరోపణ

నవతెలంగాణ – హైదరాబాద్
జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. గత రాత్రి కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కోసం ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను దింపారన్న సమాచారం ఉందని, కాబట్టి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. బలంగా ఉన్న జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పాలకులను గద్దె దింపడం ఖాయమని, కాబట్టి వారు ఎంతకైనా తెగించే అవకాశం ఉందన్నారు. తనను ఎంతగా భయపెడితే తాను అంతగా రాటుదేలుతానని తేల్చి చెప్పారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికులు, వీర మహిళలపై చేసిన దాడి గురించి పవన్ ప్రస్తావిస్తూ.. అప్పట్లో బలమైన కార్యాచరణ లేక వెనకడుగు వేశామని, ఇప్పుడు మాత్రం అలా కాదన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కటి కూడా దక్కకూడదని అన్నారు. తాను సినీ నటుడిని కావడం వల్ల అభిమానుల తాకిడి తనను అడ్డుకుంటోందని, లేదంటే మరింత బలమైన నాయకుడిగా జనంలోకి చొచ్చుకుని వెళ్లి ఉండేవాడినని పవన్ స్పష్టం చేశారు.

Spread the love