ఫోన్‌ ట్యాపింగ్‌ పై పోలీసులకు పూర్తి స్వేచ్ఛ

Police have complete freedom over phone tapping– ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈ అంశంపై రివ్యూ చేయలేదు
– బీఆర్‌ఎస్‌ ఎందుకు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేయట్లేదు?
– కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నిపుణుల సూచనలతోనే ముందుకెళ్తాం
– తెలంగాణ పోరాటాలు, త్యాగాల గుర్తులతో రాష్ట్ర చిహ్నం, గీతం : ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి తెలిపారు. మంచి ఆఫీసుర్లుగా పేర్లున్న అధికారులు ఈ కేసు విచారిస్తున్నారని, ఇందులో తన ప్రమేయం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈ కేసు విషయంపై సీఎం హౌదాలో ఎలాంటి సమీక్షా సమావేశం నిర్వహించలేదన్నారు. ఒకవేళ ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ తీరుపై తాను పట్టించుకుంటే, సీఎం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆయుధంగా మలుచుకుంటుందని అన్నారు. అయితే, అన్నింటిపై సీబీఐ విచారణ కోరే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు, ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ చేయాలని ఎందుకు డిమాండ్‌ చేయడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం చేయదని, కేవలం ప్రజా పాలన అందించే దిశలో తాము ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. కేరళలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం అర్థరాత్రి తరువాత ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం ఉదయం తుగ్లక్‌ రోడ్‌ లోని సీఎం అధికారిక నివాసాన్ని మీడియా మిత్రులతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడే తొలిసారి ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టాక డిసెంబరు నెలాఖరులో అధికారుల బదిలీలు చేపట్టినప్పుడు ఎస్‌ఐఐబీలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అదృశ్యమైనట్టు ఆ శాఖ అధికారులు గుర్తించినట్లు చెప్పారు. అలా దొంగతనం పేరుతో నమోదైన కేసు కాస్తా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుగా మారిందని వివరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు తాను పాల్పడనని, ఐఎస్‌ఐ టెర్రరిస్ట్‌లు, దేశరక్షణకు ముప్పు కలిగించే వ్యక్తులపై ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతూ ఉండవచ్చని, ఆ విషయం తనకు తెలియ దని అన్నారు. హార్డ్‌ డిస్క్‌లు, సర్వర్లు ధ్వంసం చేయడంతో తీవ్రవాదులకు సంబంధించిన విలువైన సమాచారం పోయినట్లు తాను విన్నానని చెప్పారు. అయితే… ఇంకా ఈ విషయంపై స్పష్టత రాలేదన్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని, ఏ ఒక్క సంఘటనా జరగలేదని అన్నారు. అలాగే కాంగ్రెస్‌ అధికారం చేపట్టాక రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతా సమస్యలు తలెత్తలేదని, ఇది తన పాలన తీరుకు నిదర్శనమని తెలిపారు. అయితే పక్క రాష్ట్రం ఏపీలో చాలామంది అధికారులను ఈసీ బదిలీ చేసిందని, తెలంగాణలో ఇలాంటి ఒక్క ఘటన కూడా నమోదు కాలేదని గుర్తుచేశారు. ఎన్నికల వ్యవహారంలో ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేయలేదన్నారు. కానీ అదే పక్క రాష్ట్రంలో 100 మంది అధికారులపై గోడలకు ఏసీ కొట్టారని, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో ఆరోపణలకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలులేవన్నారు. గతంలో 100 యూనిట్లు వాడితే ఇప్పుడు 140 యూనిట్ల దాకా విద్యుత్‌ వినియోగం పెరిగిందని వివరించారు. ప్రకృతి వైపరీత్యాలతో చెట్లు వైర్లపై తెగిపడడం, వాడకం పెరగడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పెరగడం వంటి పలు కారణాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు.
తెలంగాణ అంటే పోరాటాలు.. త్యాగాలు
తెలంగాణ అంటే పోరాటాలు, త్యాగాలని, ఈ గుర్తులే ఇకపై తెలంగాణ చిహ్నం(రాజముద్ర)లో ఉంటాయని రేవంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ అంటే రాజులు, రాజరికాలు గుర్తు రావని, ఆ రాజులకు వ్యతిరేకంగా ఎల్లప్పుడూ కోట్లాడిన చరిత్ర తెలంగాణదని అన్నారు. అదే రాజరిక ఆనవాళ్లు చిహ్నంలో ఉంటే పాలకుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుందని చెప్పారు. అందువల్ల కాకతీయ తోరణంతో సహా రాజరికానికి సంబంధించిన గుర్తులేవీ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. పోరాటాలు, త్యాగాలను స్మరించుకునేలా, రాష్ట్రంలో సమ్మక్క-సారక్క, నాగోబా జాతర, పిల్లల మర్రి లాంటివి ఎన్నో చిహ్నలు ఉన్నాయన్నారు. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం జూన్‌ 2న ఆవిష్కరించబోయే అధికారిక రాష్ట్ర చిహ్నంలో ఈ పోరాటాలు, త్యాగాలే ఉంటాయని చెప్పారు. మనమేంటో కనిపించేలా రాజముద్ర ఉంటుందని, ఆ చిహ్నం రూపకల్పన బాధ్యతలు కళాకారులకే వదిలేశానన్నారు. తానేమీ 80 వేల పుస్తకాలు చదవలేదన్నారు. ఇక రాష్ట్ర గీతాన్ని రూపొందించే బాధ్యతలు కవి అందెశ్రీకి వదిలేశానని, మ్యూజిక్‌ కంపోజింగ్‌ ఎవరితో చేయించుకుంటారో ఆయనిష్టమని తేల్చిచెప్పారు. కీరవాణి విషయంలో విమర్శలు ఎదుర్కొం టారో, సమర్థించుకుంటారో అందెశ్రీ చూసుకుంటారన్నారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించడమే తన కర్తవ్యమని చెప్పారు. జూన్‌ 2లోపు గీతాన్ని పూర్తి చేయమని చెప్పానని, ఆయనేలా చేయాలో కూడా తానే చెప్తే, అది కాళేశ్వరం స్టోరీగా మారుతుందన్నారు. తెలంగాణ తల్లి, లోగోను రూపొందించే బాధ్యతలు ఫైన్‌ఆర్ట్స్‌ కాలేజీకి చెందిన వ్యక్తి, నిజమాబాద్‌ బిడ్డకు అప్పగించానన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆనాలోచితంగా కేసీఆర్‌ ఎందుకు వ్యవహరించారో లై డిటెక్టర్‌ పరీక్ష చేస్తే తప్ప అసలు విషయాలు బయటికి రావన్నారు. ఈ విషయంలో కేసీఆర్‌ ని విచారణ చేయాలేమో అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ ప్రాజెక్ట్‌ పై అసెంబ్లీకి వచ్చి చెబుతారేమో అనుకుంటే ఆయన రావట్లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌ సర్వేలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఆ సర్వేలు చేసే సామర్థ్యమున్న రెండు ఏజెన్సీలను సంప్రదించినట్లు చెప్పారు. మట్టి నాణ్యత పరీక్షలు కూడా వేరే దగ్గర చేసి ప్రాజెక్టు వేరే చోట కట్టారన్నారు. ఈ విషయాలేవీ రికార్డులో లేవన్నారు. ఈఎన్సీ మురళీధర్‌ రావు పోతూపోతూ అన్ని పట్టుకెళ్లాడని విమర్శించారు. ఇంకేమైనా ఉంటే ఆయన మనషులతో తెప్పించుకుంటున్నారని, సంబంధిత పైళ్లను చింపివేయాలని చెబుతున్నాడన్నారు. తప్పు జరిగిందని చర్యలు తీసుకోబోతే, ఇంజనీరింగ్‌ శాఖలోని ఆఫీసుర్లు ఒకరినొకరు కాపాడుకుంటున్నారని, ఎవరు ఏ విషయం చెప్పట్లేదన్నారు.
విరిగింది కేసీఆర్‌ పన్ను కాదు, కాళేశ్వరం వెన్నెముక
మేడిగడ్డ బ్యారేజీలో జరిగింది కేసీఆర్‌ 32 పళ్లలో ఒక పన్ను విరగడం కాదని, మొత్తం ప్రాజెక్ట్‌ వెన్నెముకనే విరిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విషయంలో నిపుణులు సూచనల మేరకే ముందుకెళ్తామని తేల్చి చెప్పారు. అయితే రాజకీయాలకు పోకుండా… నీళ్లను తాత్కలికంగా లిప్ట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీ. గేట్లన్నీ తెరిచిపెట్టాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ(ఎన్డీఎస్‌ఏ) అధికారులు చెబుతున్నారన్నారు. అలాకాకుండా గేట్లు క్లోజ్‌ చేస్తే బ్యారేజ్‌ మొత్తం కూలిపోయే పరిస్థితులున్నాయని చెబుతున్నారన్నారు. మేడిగడ్డలో నీళ్లు ఎత్తి అన్నారంలో పోయాలని కేసీఆర్‌ అంటున్నారని, అన్నారంలో ఉన్న నీళ్లనే సముద్రంలోకే వదిలామని గుర్తు చేశారు. మేడిగడ్డ నుంచే నీళ్లు ఎత్తిపోస్తే అన్నారం గేట్లు ఎత్తినందున మళ్ళీ మేడిగడ్డకే నీళ్లు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు 30 రోజులు ఎత్తిపోశాక, 31వ రోజు వర్షం పడితే నీళ్లన్నీ సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి అని చెప్పారు. కేసీఆర్‌ ఈ లాజిక్‌ మిస్‌ అయ్యారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక ఇప్పటివరకు 52 టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారని, వీటికి కట్టిన కరెంట్‌ బిల్లులు సముద్రంలోకి వదిలినట్లు అయిందన్నారు. జ్యుడీషియల్‌ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకే పరిమితమన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను పెంచడంపై దష్టి పెడితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ముందుకు సాగదన్నారు. విచారణ చేపడితే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పనులు చేయించలేని, బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర భూమిలో ఏముందో పరీక్షలు జరిపితే తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితులున్నాయన్నారు. పన్నెండున్నర మీటర్లకు ఆరు మీటర్లు ఉంటే రెండున్నర మీటర్లు.. మేడిగడ్డ బ్యారేజీ ఇసుకమీద కట్టారన్నారు. బ్లాక్లు వేటికవే ఉండడంతో ఒక్కో బ్లాక్‌ మీద భారం పడిందన్నారు. నిశ్చితమైన అభిప్రాయం సలహాలను పాటిస్తానని తేల్చి చెప్పారు.

Spread the love