ఆరు నెలల్లో పూర్తి చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణ :
పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
నడవడానికి కూడా వీలు లేని పూర్తిగా గుంతలమయమైన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరు నెలల్లో పూర్తి చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ హైవే నుంచి బోట్యా నాయక్ తండా వరకు రోడ్డు పూర్తిగా గుంతలమ యంగా మారడంతో తండావాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శనివారం తండా నుంచి మిర్యాలగూడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వరకు ఆరు కిలోమీటర్లు గ్రామస్తులతో కలిసి జూలకంటి రంగారెడ్డి పాదయాత్ర చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఈ రోడ్డుకు ఆరు నెలల కింద టెండర్ వేశారన్నారు. కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడంతో తండావాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈవిషయమై అనేకమార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రోడ్డంతా గుంతలమయంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. జూన్ 10లోపు పనులను పూర్తి చేయకపోతే ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేశ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి, రవినాయక్, పరుశరాములు, పట్టణ కార్యదర్శి మల్లు గౌతంరెడ్డి, గ్రామ సర్పంచ్ సాగర్నాయక్, ఉపసర్పంచ్ శ్రీను, గూడూరు సర్పంచ్ కృష్ణయ్య, సీపీఐ(ఎం) నాయకులు పిల్లుట్ల సైదులు, బొంగరాల వెంకటయ్య, మేక రాంబాబు, మంగా, కరీమున్నీసా బేగం పాల్గొన్నారు.



