– యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందర్నీ రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ చైర్మెన్ శ్రీధర్ కుమార్ లోధ్, వర్కింగ్ చైర్మెన్ ఎం రామేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం గూగుల్ మీట్లో నిర్వహించిన సమావేశంలో గత వంద రోజుల నుంచి విశ్వవిద్యాలయాల్లో వివిధ రకాల ఆందోళన పోరాటాలు చేసినా కానీ ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలిపారు. దీంతో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ సోమవారం నుంచి సమ్మెకు సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి యూనివర్సిటీలో పనిచేస్తున్న 1,445 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రాజేష్ కన్నా, పల్లా రేష్మారెడ్డి, దశరథం, జరుపుల చందులాల్, వెంకటేశ్, సోమేష్, ఆదిత్య, శంకర్ పాల్గొన్నారు.