బొప్పూడి సభ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోడీ

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాగళం సభలో పాల్గొనేందుకు బొప్పూడి చేరుకున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నాలుగు హెలికాప్టర్ల కాన్వాయ్ తో మోడీ బొప్పూడికి తరలి వచ్చారు. నాలుగు హెలికాప్టర్లు దిగడంతో, మోడీ ఏ హెలికాప్టర్ లో ఉన్నారన్నది ఆసక్తి కలిగించింది. మోడీ రాకను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వాయుసేన హెలికాప్టర్ నుంచి దిగిన ప్రధాని మోడీకి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్వాగతం పలికారు. ఇక, హెలిప్యాడ్ నుంచి టయోటా ఫార్చ్యూనర్ వాహనంలో మోడీ సభా ప్రాంగణం వద్దకు బయల్దేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజాగళం సభ ప్రధాన వేదిక పైకి చేరుకున్నారు. వారి రాకతో సభకు విచ్చేసిన టీడీపీ, జనసేన కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు, పవన్ సభకు వచ్చినవారికి చేయి ఊపుతూ, నమస్కారం పెడుతూ అభివాదం చేశారు.

Spread the love