– సీట్ల సర్దుబాటుపై చర్చ
ముంబయి : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇండియా ఫోరంలోని ప్రతిపక్ష పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆప్, సమాజ్వాదీ పార్టీలతో కాంగ్రెస్ సీట్ల ఒప్పందాలను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర లోని 48 సీట్లలో ఎనిమిది స్థానాలపై నెలకొన్న అని శ్చితిపై చర్చించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు గురువారం ఫోన్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాహుల్ చేపడుతున్న భారత్ జోడో న్యారు యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. దీంతో ఉద్ధవ్తో సుమారు గంటసేపు మాట్లాడినట్టు సమాచారం. ముంబయిలోని ఆరు లోక్ సభ స్థానాల్లో ముంబయి సౌత్ సెంట్రల్, ముంబయి నార్త్ వెస్ట్లలో మూడింటిలో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆవర్గాలు తెలిపాయి. ముంబయిలోని నాలుగు స్థానాలు సహా రాష్ట్రంలోని 18 లోక్సభ స్థానాల్లో ఉద్థవ్ థాకరే పోటీ చేయాలను కుంటున్నట్టు తెలుస్తోంది. ఉద్ధవ్ థాకరే ముంబయి సీట్లలో అధిక స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. సీట్ల సర్దుబాటుపై రాహుల్, శరద్ పవార్ ఇప్పటికే ఫోన్లో చర్చలు జరిపారు. ఎంవీఏ కూటమి లోక్సభ సీట్ల సర్దుబాటు చివరి దశకు చేరుకుందని కాంగ్రెస్ వెల్లడించింది.