నవతెలంగాణ – ఢిల్లీ: మణిపూర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమయ్యింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఏఐసీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ సీఎంలు, వివిధ రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యాత్రలో పాల్గొన్నారు. ఇక ఏపీ నుంచి సీనియర్ నేత రఘువీరారెడ్డి, వైఎస్ షర్మిల కూడా రాహుల్ వెంట ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 14 ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన భారత్ జోడో న్యాయ్ యాత్ర కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా ఫ్లైట్ సర్వీసులు లేట్ అయ్యాయి. దీంతో మణిపూర్ కు ఆలస్యంగా వచ్చారు రాహుల్. మణిపూర్ లోని తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర జరగనుంది. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్ సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6 వేల 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను.. మార్చి 20 లేదా 21న ముంబైలో ముగించనున్నారు రాహుల్. యాత్రలో ప్రధాని మోదీ వైఫల్యాలు, నిరుద్యోగం, ధరల పెంపు, సామాజిక న్యాయం అంశాలు ప్రస్తావించనున్నారు రాహుల్ గాంధీ. అయితే, తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. బస్సులతో పాటు అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని చెప్పారు.