ఢిల్లీని మళ్లీ ముంచెత్తుతున్న వర్షాలు…

నవతెలంగాణ – ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ వర్షాలు ముంచెతుతున్నాయి. గత వారం భారీ స్థాయిలో వచ్చిన వర్షాల కారణంగా ఢిల్లీ జన జీవనం స్తంభించింది. కాస్త తేరుకునేలోపే నిన్న రాత్రి నుంచి మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. దాంతో, ఢిల్లీ ప్రజల కష్టాలు తీరడం లేదు. తాజా వర్షాల కారణంగా యమునా నదిలో నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. అయితే ఈ రాత్రికి నదిలో నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. కానీ, ఆదివారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. యమునా నదిలో ప్రమాద స్థాయి నీటి మట్టం 205.33 మీటర్లు కాగాఈ ఉదయానికే 206.02 మీటర్లను చేరుకుంది. గత 45 ఏళ్లలో తొలిసారిగా ఇంతటి భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హత్నికుండ్ బ్యారేజి నుంచి నీటిని యమునా నదిలోకి వదిలిపెట్టిందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అయితే దీనిని హర్యానా ప్రభుత్వం ఖండించింది. మరోవైపు ఫ్రాన్స్, యూఏఈ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో మాట్లాడారు. ఢిల్లీలో వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

Spread the love