మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం
పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన పగటి ఉష్ణోగ్రతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఆదివారం నుంచి బుధవారం వరకు చాలా జిల్లాల్లో మోస్తరు వర్షం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న వెదర్ రిపోర్టులో వెల్లడించారు. ఆదివారం, సోమ వారాల్లో కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్ జిల్ల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఐదో తేదీన మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఆరో తేదీన నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ రెండు రోజుల పాటు మిగతా అన్ని జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయి. శనివారం రాష్ట్రంలో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఉష్ణోగ్రతల వివరాలు
నిజామాబాద్ 44.0 డిగ్రీలు
ఆదిలాబాద్ 43.8 డిగ్రీలు
మెదక్ 43.6 డిగ్రీలు
రామగుండం 43.0 డిగ్రీలు
ఖమ్మం 42.8 డిగ్రీలు
మహబూబ్నగర్ 42.8 డిగ్రీలు
హైదరాబాద్ 41.5 డిగ్రీలు



