నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుపై బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మూడో రౌండ్లో ఓట్ల లెక్కింపును తారుమారు చేశారని ఆరోపించారు. ఏకపక్షంగా ఓ అభ్యర్థికి మెజార్టీని ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో రౌండ్ను మరోసారి లెక్కించాలని డిమాండ్ చేశారు. ఒక అభ్యర్థికి మేలు చేసే విధంగా కౌంటింగ్ జరుగుతోందని ఆరోపించారు. కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండా లీడ్ ప్రకటించారన్నారు. తమ సందేహాలను నివృత్తి చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని ఆరోపించారు. అతనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. మూడో రౌండ్ వివరాలు అడిగితే పోలీసులు బయటకు నెట్టారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ పైన తమకు నమ్మకముందని వ్యాఖ్యానించారు.