నవతెలంగాణ – పరకాల
పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, గిర్దావర్లు మరియు సర్వేయర్లతో స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూ భారతి, సదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఎన్నికల నిర్వహణ, మీ సేవ సర్టిఫికెట్ల జారీ మరియు రెవెన్యూ సేవల మెరుగుదల వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.
అనంతరం, ఆర్డీవో స్థానిక పరకాల తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా సందర్శించారు. కార్యాలయ రికార్డులను, ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు, ప్రజల నుంచి అందిన ప్రజావాణి ఫిర్యాదుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. భూ భారతి, సదా బైనామా దరఖాస్తుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశిస్తూ, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. ఈ తనిఖీలు మరియు సమీక్షా సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


