జనగామ నుంచి 21 కిలోమీటర్లు ప్రయాణం
దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్గేట్ వద్ద ప్రమాదం
అదుపులో నిందితుడు.. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లే
పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
నవతెలంగాణ-జనగామ
జనగామ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆర్టీసీ అద్దె బస్సును చోరీ చేశాడు. ఆ బస్సుతో సుమారు 21 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. అనంతరం దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్గేట్ వద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన జిట్టబోయిన వెంకన్న ట్రాక్టర్ డోజర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం జనగామకు వచ్చిన ఆయన మద్యం సేవించాడు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జనగామ బస్టాండ్లో పార్కింగ్లో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సును తీసుకెళ్లాడు. సుమారు 21 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్గేట్ వద్దకు చేరుకోగానే బస్సు అదుపుతప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టింది.ఈ ప్రమాద ఘటనను గమనించిన టోల్గేట్ సిబ్బంది డ్రైవర్ పరిస్థితిని పరిశీలించి అనుమానం రావడంతో దేవరుప్పుల పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా వెంకన్న మద్యం మత్తులో బస్సును తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ బస్సును బుధవారం రాత్రి చివరి ట్రిప్ ముగించుకొని వచ్చిన డ్రైవర్ బస్టాండ్ ప్రాంగణంలో పార్క్ చేసి, తాళాలు బస్సులోనే ఉంచి ఇంటికి వెళ్లినట్టు సమాచారం. దీన్ని అవకాశంగా తీసుకున్న వెంకన్న ఈ ఉదంతానికి పాల్పడ్డాడు. అనంతరం బస్సును, వెంకన్నను జనగామ పోలీసులకు అప్పగించారు. అద్దె బస్సు యజమాని గంట గోపీ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి చెప్పారు. మద్యం మత్తు, మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే వెంకన్న ఈ చర్యకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు చోరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



