ఈనెల 5 నుంచి 8 వరకు సెయిలింగ్‌ పోటీలు

– విలేకరుల సమావేశంలో మేజర్‌ జనరల్‌ అజరుశర్మ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈనెల 5వ తేది నుంచి 8 వరకు సెయిలింగ్‌ పోటీలు నిర్వహించనున్నట్టు, 9న బహుమతుల ప్రదానం చేయనున్నామని మేజర్‌ జనరల్‌ అజరుశర్మ తెలిపారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ ఆవరణంలోని సికింద్రాబాద్‌ సెయిలింగ్‌ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో 37ఏండ్లుగా హుస్సేన్‌సాగర్‌లో జాతీయ స్థాయి సెయిలింగ్‌ ఛాంఫియన్‌షిఫ్‌ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌’ అనేది ప్రతిష్టాత్మక ఈవెంట్‌ అని, స్థానికులు, టూరిస్టులు ఆసక్తిగా చూస్తారని చెప్పారు. నేషనల్‌ సెయిలింగ్‌ కోచింగ్‌క్యాంప్‌ను 20జూన్‌ నుంచి 30 వరకు నిర్వహించామని తెలిపారు. దేశంలోనే హైదరాబాద్‌ సెయిలింగ్‌ పోటీలకు ప్రముఖ నరగమని అని అన్నారు. జులై, ఆగష్టు మాసాల్లో వాతావరణం కూడా సహకరిస్తుందని, సెయిలర్స్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, బోట్‌ను నడిపించడానికి సులభంగా ఉంటుందని తెలిపారు. ఈ పోటీల్లో సెయిలర్స్‌ ప్రతిభా ఆధారంగానే జాతీయ స్థాయిలో ర్యాంకులు కేటాయించనున్నట్టు చెప్పారు.

Spread the love