రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేయండి : సీఎస్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 4వ తేదీ హైదరాబాద్‌ పర్యటన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సోమవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ఆమె వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీకుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్‌శర్మ, అర్వింద్‌కుమార్‌, హౌమ్‌శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, జైళ్లు, ఫైర్‌ సర్వీసుల డైరెక్టర్‌ జనరల్‌ నాగిరెడ్డి, కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాసరాజు, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌రవీంద్ర, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌ బీ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రపతి జులై 4వ తేదీ సాయంత్రం అల్లూరి సీతారామరాజు 125్ణవ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం జరిగే మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్‌ ఏర్పాటు చేసి, బందోబస్తు చేపట్టాలన్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా, వైద్య బందాలను నియమించడం, పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాలన్నారు.

Spread the love