తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో 2కే, 5కే రన్స్‌

– పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సినీ నటులు
– డీజే టిల్లు సాంగ్‌కు మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు
నవతెలంగాణ- విలేకరులు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 2కే, 5కే రన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ అధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్డులోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ వద్ద 2కే, 5కే రన్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని హౌంశాఖ మంత్రి మహమ్మద్‌, క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, సినీనటి శ్రీలీలతోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, సింగర్‌ మంగ్లి పాల్గొన్నారు. పెద్దఎత్తున యువత ఈ రన్‌కు తరలి వచ్చింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ రన్‌ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, అడిషనల్‌ కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్యలు ప్రారంభించారు. ప్రముఖ సినీ నటులు విశ్వక్‌ సేన్‌, అశ్విన్‌, నటి నందిత శ్వేత ఈ రన్‌లో పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్‌ను శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ వినరుకృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావుతో కలిసి బెలూన్‌ వదిలి జెండా ఊపి ప్రారంభించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి ఖిల్లాపై జాతీయ జెండాను ఎమ్మెల్యే పైళ్లశేఖర్‌రెడ్డి కలెక్టర్‌ పమేలా సత్పతి, డీసీపీ రాజేశ్‌చంద్రతో కలిసి ఎగురవేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి 2కే రన్‌ను ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 2కే రన్‌ను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌, నగర మేయర్‌ పునుకొల్లు నీరజలతో కలిసి సర్దార్‌ పటేల్‌ స్టేడియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌లు అధికారులతో ట్యాంక్‌ బండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ వద్ద సెల్ఫీలు దిగారు.
రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రాచకొండ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ 5 కే రన్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. త్రివర్ణ రంగుల బెలూన్‌లను వదిలి, రన్‌లో పాల్గొంటున్న వారిని అభినందించారు.
నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 2కే రన్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 2కే రన్‌ను పోలీస్‌, యువజన సర్వీసుల శాఖ ఆధ్యర్యంలో నిర్వహించారు. దీన్ని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ పీస్‌, ఎస్పీ ఉదరు కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆసిఫాబాద్‌ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో 2కే, 5కే రన్‌ నిర్వహించారు. కలెక్టర్‌ బోర్కడే హేమంత్‌ సహదేవ్‌రావు అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్‌ బాజ్‌పాయితో కలిసి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
డీజే టిల్లు సాంగ్‌కు మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలోని ఏవీ ఇన్ఫోఫ్రైడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ 2కే రన్‌ వేదికపై మంత్రి మల్లారెడ్డి డీజే టిల్లు పాటకు స్టెప్పులేసి అందరిలో జోష్‌ నింపారు. మంత్రితో కలిసి ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, కలెక్టర్‌ అమోరు కుమార్‌, రాచకొండ సీపీ కమిషనర్‌ చౌహాన్‌, మేయర్‌ జక్క వెంకట్‌ రెడ్డి తదితరులు జోష్‌గా జుంబా డ్యాన్సు చేశారు.

Spread the love