నవతెలంగాణ – హైదరాబాద్
టీంఇండియా పేసర్ మహమ్మద్ షమీపై నమోదైన దాడి, హత్యాయత్నం, గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. షమీపై నమోదైన ఈ కేసు విషయంలో నెల రోజుల్లోపు తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు పశ్చిమ్ బంగా సెషన్స్ కోర్టుకు గురువారం స్పష్టంచేసింది. షమీపై జారీచేసిన అరెస్టు వారెంట్ను నిలిపివేస్తూ కలకత్తా హైకోర్టు ఈ ఏడాది మార్చి 29న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అతని సతీమణి హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హాసీన్ జహన్ దాఖలు చేసిన ఈ అప్పీల్ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. షమీపై నమోదైన కేసులో క్రిమినల్ రివిజన్ చేపట్టాలని సెషన్స్ న్యాయమూర్తిని ఆదేశించింది. నెల రోజుల్లోపు ఈ కేసుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. షమీ-హసీన్ 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2018లో షమీపై హసీన్ గృహ హింస, దాడి, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేసింది. ఈ విషయంపై హసీన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో షమీపై దాడి, హత్యాయత్నం, గృహహింస తదితర అభియోగాలపై కేసు నమోదైంది.