– సీఐటీయూ ఆద్వర్యంలో నివాళులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
తుక్కుగూడలో లైంగికదాడి, హత్యకు గురైన ఊకే శిరీషకు సీఐటీయూ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ శిరీషను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన ప్రభుత్వాలు, యాజమాన్యాలు ఘటనకు బాధ్యత వహించాలని అన్నారు.
ఆదివాసీ యువతి జీవితాన్ని బలిగొన్న నిందితుడితో పాటు ఘటనకు సహకరించిన వారందరినీ ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారించి, వెంటనే అత్యంత కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధి కోసం ఏజెన్సీ గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చే గిరిజన, దళిత, వెనుకబడిన తరగతుల మహిళలకు ప్రభుత్వం, సంబంధిత సంస్థలు వసతి, భద్రతా చర్యలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, నాగవల్లి, అంజలి, మహేష్, సాయిలు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



