త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం..

నవతెలంగాణ-హైదరాబాద్ : అతి త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ను విమర్శించే అర్హత హరీష్ రావుకు ఏమాత్రం లేదని మండిపడ్డారు. ఆగష్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోందని చెప్పారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో కోట్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, విద్య గురించి కేసీఆర్ తన పాలనలో ఏ రోజూ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూశారన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమన్నారు.

Spread the love