రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన
వచ్చే మూడ్రోజులు నాలుగు డిగ్రీల మేర తగ్గనున్న ఉష్ణోగ్రతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ నెల నాలుగో తేదీన కేరళం, తమిళనాడు, లక్ష్యదీవులు, బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎండలు క్రమంగా తగ్గుతున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు నాలుగు డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముంది. వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్లతో కూడిన గాలులు వీస్తాయనీ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆ జిల్లాలాకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికను విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పలు ప్రాంతాల్లో పడే అవకాశాలున్నాయి. మంగళవారం రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో 43 ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, ములుగు, మహబూబాబాద్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడ వాన పడింది.
రేపు కేరళంకు ‘నైరుతి’ రుతుపవనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



