ప్రభుత్వానికి సిఫారసు చేసిన రైతు కమిషన్
ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావం
రైతులు ప్రత్యామ్నాయపంటల వైపు మళ్లాలి : రైతు కమిషన్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పాడుతున్న నేపథ్యంలో రైతాంగం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి కేంద్రీకరించాలని రైతు కమిషన్ విజ్ఞప్తి చేసింది. దీనికోసం రాష్ర్టస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డికి సూచించినట్టు కమిషన్ చైర్మెన్ కే కోదండరెడ్డి తెలిపారు. మంగళవారంనాడిక్కడి బూర్గుల రామకృష్ణారావు భవన్లోని రైతు కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాములు నాయక్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాతావరణ మార్పులు, భూసార క్షీణత, నీటి కొరత, మార్కెట్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని పంటల మార్పిడిని ప్రభుత్వ విధానంగా అమలు చేయాలని కోరారు. దీనికి సంబందించిన సమగ్ర నివేదికను ఇప్పటికే సీఎంకు అందచేశామన్నారు. దేశవ్యాప్తంగా పంటల మార్పిడిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం గతంలో 5.52 లక్షల ఎకరాలు ఉండగా, ఇప్పుడు దాదాపు లక్ష ఎకరాలు తగ్గిపోయిందని తెలిపారు. ఉద్యాన పంటల విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ ద్వారానే దీన్ని అధిగమించగలమని చెప్పారు.
పంటల మార్పిడిపై రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటుకు వ్యవసాయ శాఖ మంత్రిసానుకూలంగా స్పందించారన్నారు. ఈ కమిటీ కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాలు, మండలాల్లో రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలను అధ్యయనం చేయాలని సూచించారు. నూనెగింజలు, జొన్నలు, కందులు, పెసర్లు, మినుములు వంటి పప్పుధాన్యాల సాగుకు రైతులు సిద్ధం కావాలని కోరారు. ఈ మేరకు రాష్ర్టంలోని అన్ని రైతు వేదికల ద్వారా సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అలాగే పప్పుధాన్యాలు, కూరగాయలు పండించే రైతులకు బోనస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశామని వివరించారు. దీనికోసం కేంద్రప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరి, మిర్చి పంటల విస్తీర్ణాన్ని తగ్గించుకోవాలని సూచించారు.



