పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి బలమైన వేదిక అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో స్త్రీనిధి వార్షిక కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 2011లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీనిధి, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరింత బలోపేతం అవుతోందన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న మహిళలను ఆదుకోవడానికే ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా 32 లక్షల మందికి పైగా మహిళలకు రూ.24 వేల కోట్ల రుణాలు అందించడం గొప్ప విజయమని పేర్కొన్నారు. తెలంగాణ స్త్రీనిధి మోడల్ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు.
“కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. ఆ దిశగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. మహిళల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది” అని మంత్రి తెలిపారు. దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 18 శాతానికే పరిమితమైందననీ, అభివృద్ధి చెందిన దేశాల్లో అది 40 శాతానికి చేరుకుందన్నారు. తెలంగాణ మహిళలు కూడా ఆ స్థాయికి ఎదగాలనీ, అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని చెప్పారు.
స్త్రీనిధి సంస్థపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తున్న సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం తమదనీ, ఇప్పటి వరకు స్త్రీనిధిలో ఒక్కరిని కూడా తొలగించలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, డిప్యూటీ ఎండీ శ్రీనాథ్, స్త్రీనిధి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి బలమైన వేదిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



