విద్యార్థులు ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలి

– శ్రీ భాషితలో వీడ్కోలు పార్టీ హంగామా
నవతెలంగాణ –  కమ్మర్ పల్లి
విద్యార్థులు ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కళాశాల డైరెక్టర్ సుంకేట రవి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పద్మశాలి విజయ సంఘం ఫంక్షన్ హాల్ లో స్థానిక శ్రీ భాషిత జూనియర్ కళాశాలల మొదటి సంవత్సర విద్యార్థులు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సుంకేటరవి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాల కోసం కష్టపడి మార్చిలో జరిగే వార్షిక పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని కోరారు. విద్యార్థులు వారి భవిష్యత్తులో పోటీ పరీక్షలలో పాల్గొని ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల కల నెరవేర్చాలన్నారు.ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. విద్యార్థుల కేరింతలు, హంగామాతో ఫంక్షన్ హాల్ మారుమోగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్, డైరెక్టర్ లు సిలివెరి సంజీవ్, మలావత్ సంతోష్, లెక్చరర్లు హన్మాండ్లు, సుమన్, సాయన్న, గంగారం, గజానంద్, శ్రీధర్, రాజేష్, శృతి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love