నవతెలంగాణ-హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి యువతిని వివస్త్రను చేసి వేధించిన సంఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీని ఆదేశించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యానికి బానిసైన పెద్దమారయ్య అనే కూలీ ఈ నెల 6న (ఆదివారం) రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో తన తల్లితో కలిసి బాలాజీనగర్ బస్టాండ్ నుండి ఇంటికి వెళుతున్నాడు. ఆ సమయంలో ఓ యువతి దుకాణం నుండి ఇంటికి వెళుతుండగా పెదమారయ్య ఆమెపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఆగ్రహించడంతో… దాడి చేశాడు. అంతేకాకుండా ఆమె దుస్తులు చించి లాగేశాడు. దాదాపు పదిహేను నిమిషాల పాటు యువతి రోడ్డుపై నగ్నంగా రోదిస్తూ కూర్చుంది. బైక్ పై వెళుతున్న ఓ మహిళ ఎందుకు అలా చేస్తున్నావని ప్రశ్నించగా ఆమెపై కూడా దాడి చేశాడు. అతను వెళ్లిన తర్వాత కొంతమంది వచ్చి ఆమెపై దుస్తులు కప్పి, జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.