భవ్య స్కీం ఫేజ్ – 1లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి
ఏరో – డిఫెన్స్ కారిడార్, రెండు మెగా లెదర్ పార్కులను మంజూరు చేయండి
హైదరాబాద్ లో ‘నేషనల్ డిజైన్ సెంటర్’ ఏర్పాటుకు చొరవ చూపండి :
కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా… వికసిత్ భారత్@ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేలా తెలంగాణ ఇండస్ట్రియల్ ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామని, అందుకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడిక్కడ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా… రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సంబంధించిన పలు అంశాలపై పీయూష్ గోయల్ కు వినతి పత్రం అందజేశారు. “జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో రూ. 8,500 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ ఇన్నోవేషన్, ఆర్ అండ్ డీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు హ్యుందాయ్ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ లాజిస్టిక్ హబ్ అభివృద్ధికి కేంద్రం చొరవ చూపాలి” అని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. “భవ్య పథకం పేజ్ -1లో భాగంగా రాష్ట్రంలో 15 నుంచి 20 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్లను సిద్ధం చేస్తోంది. వీటికి జూన్ – జులై 2026 దరఖాస్తు విండోలోనే అనుమతి ఇస్తే రాష్ట్రంలో తయారీ రంగం మరింత బలోపేతం అవుతుంది” అని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రానికి ‘ఏరో – డిఫెన్స్ కారిడార్’ను మంజూరు చేయాల్సిన అవసరాన్ని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. హైదరాబాద్లో ‘నేషనల్ డిజైన్ సెంటర్’ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చొరవ చూపాలన్నారు. మెగా లెదర్, ఫుట్వేర్ అండ్ యాక్సెసరీస్ క్లస్టర్ డెవలప్మెంట్ (ఎంఎల్ఎఫ్ ఏసీడీ) పథకం కింద రెండు మెగా లెదర్ పార్కులను కేటాయించాలని కోరారు. మెదక్ జిల్లా మనోహరాబాద్లో రూ. 2,050 కోట్లతో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఎన్ హెచ్ఎల్ఎంఎల్) భాగస్వామ్యంతో చేపట్టిన మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఏర్పాటు చేస్తున్న ఇర్రేడియేషన్ ఫెసిలిటీకి ‘ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్స్’ పథకం కింద నిధులను కేటాయించాలన్నారు. పామ్ ఆయిల్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, క్రూడ్ పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్ సీఎల్)పై ప్రత్యేక దృష్టి సారించాలని, అక్కడ ఉత్పత్తి అయ్యే మొత్తం యూరియాను తెలంగాణకే కేటాయించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతేడాది ఎరువుల సరఫరాలో ఎదురైన అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి సహకరించండి
- Advertisement -
- Advertisement -



