నేడు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు

నవతెలంగాణ ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో ఆయన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్‌ సాల్వే.. సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసును జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబరు 17న తీర్పు వాయిదా వేసింది.
ఈ అంశంతో ముడిపడిన రెండు కేసుల విచారణ (ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు దాఖలు చేసిన కేసు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు) ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నందున సుప్రీంకోర్టు వాటికంటే ముందు 17-ఎపై నిర్ణయాన్ని వెలువరించనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ ఈ తీర్పును వెలువరించనున్నట్టు సమాచారం.

Spread the love