విషప్రయోగంతో 35కు పైగా కోతులను చంపిన ఆగంతుకులు..

నవతెలంగాణ- కరీంనగర్: మూగజీవాలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. 35కు పైగా కోతులకు విషం పెట్టి చంపేశారు. వాటి కళేబరాలను ఓ శ్మశానం వద్ద పడేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహాం పెల్లుబుకుతోంది. పథకం ప్రకారం కోతులను మట్టుబెట్టారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇటీవల స్థానికంగా కోతుల బెడద ఎక్కువైపోయిందని అక్కడి వారు చెబుతున్నారు. మైనింగ్ కారణంగా కొండలు కనుమరుగైపోవడంతో కోతులు గ్రామాలపై పడుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆగంతుకులు వాటిని విషప్రయోగంతో మట్టుబెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. కోతుల కళేబరాలను చూసి షాకైపోయిన గ్రామస్తులు వెంటనే సర్పంచ్‌కు సమాచారం అందించారు. అటుపై సర్పంచ్ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, పశువైద్య అధికారి వచ్చి పంచనామా జరిపించారు. ఈ హేయమైన చర్యకు పాల్పడిందెవరో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, స్థానికుల్లో కొందరు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, కోతుల అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మూగజీవాలకు తుది వీడ్కోలు పలుకుతూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Spread the love