నవతెలంగాణ- నాగర్కర్నూల్: ఏటీఎం కేంద్రం నుంచి దుండగులు ఏకంగా యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకొంది. పోలీసుల తెలిపిన వివారల ప్రకారం.. పెద్దకొత్తపల్లిలో శనివారం రాత్రి వర్షం పడటంతో అర్ధరాత్రి వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇదే అదనుగా భావించిన దుండగులు బస్టాండ్ చౌరస్తా సమీపంలోని ఇండియా 1 కంపెనీ నిర్వహిస్తున్న ఏటీఎంపై కన్నేశారు. మొదట సీసీ కెమెరాల తీగలను కత్తిరించి, రాడ్డుతో షట్టరును పైకి లేపి ఏటీఎంను ఎత్తుకెళ్లారు. శనివారం రాత్రి ఏటీఎం కేంద్రాన్ని మూసి వెళ్లానని, ఆదివారం తెరుద్దామని వచ్చేసరికి చోరీ ఘటన తెలిసిందని నిర్వాహకుడు స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎంలో దాదాపు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.