లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా

నవతెలంగాణ – హైదరాబాద్‌: నిజామబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తా ఏసీబీకి పట్టుబడ్డారు. పరీక్ష కేంద్రం ఏర్పాటుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు రెడ్‌హాండెడ్‌గా చిక్కారు. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని భీమ్‌గల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రవీందర్‌ గుప్తా లంచండ డిమాండ్‌ చేశారు. దీంతో ఆయన అడిగిన మొత్తాన్ని నిర్వహాకులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతకొన్ని రోజులుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. వర్సిటీ రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో పాలకమండలితో వీసీకి తలపడిన విషయం తెలిసిందే. అయితే వర్సిటీలో పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండటంతో వీసీ వెనక్కి తగ్గారు. రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. అయితే తాజాగా వీసీ రవీందర్‌ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడటం గమనార్హం.

Spread the love