– ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐల డిఫాల్ట్స్లో పెనాల్టీ ఛార్జీలు తగ్గించటంపై సీఐటీయూ ఖండన
– ప్రభుత్వం తన నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
– దేశవ్యాప్త నిరసనలకు దిగాలని శ్రామికులకు పిలుపు
న్యూఢిల్లీ : యాజమాన్యాలు కార్మికుల కోసం జమచేసే ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐల డిఫాల్ట్ల విషయంలో పెనాల్టీ ఛార్జీలను తగ్గిం చటంపై సీఐటీయూ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రంలోని మోడీ సర్కారు చర్యను తప్పుబట్టింది. యాజమాన్యాలు చట్ట పరంగా నిర్వహించాల్సిన వారి బాధ్యతను విస్మరించే విధంగా కేంద్రం తీరు ఉన్నదని వివరించింది. ఈ మేరకు సీఐటీయూ జనరల్ సెక్రెటరీ తపన్సేన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటన ప్రకారం..ఇప్పుడే ప్రమాణస్వీకారం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం తన నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి సమయం తీసుకోలేదు. ప్రయివేటు కార్పొరేట్ యజమానులు కార్మికుల విరాళాలు, వారి ప్రావి డెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్లో వాటాతో ఆడుకు నేలా అనుమతించటం, యజమానుల డిఫాల్ట్ను ప్రోత్సహించేలా కేంద్రం చర్య ఉన్నది. ఈపీఎఫ్ఓకు కార్మికుల సహకారంతో సహా ఈపీఎఫ్, పెన్షన్, ఈడీఎల్ఐ నిధులను సకాలంలో డిపాజిట్ చేయటం యజమానుల చట్టబద్ధమైన బాధ్యత. మోడీ క్యాబినెట్లోని కార్మిక మంత్రి, ఉద్యోగుల పెన్షన్ ఫండ్(ఈపీఎఫ్), ఉద్యోగుల డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం (ఈడీఎల్ఐ)కు సకాలంలో జమ చేయటంలో విఫలమైన యజమానిపై అన్ని జరిమానా ఛార్జీలను భారీగా తగ్గిస్తూ ఈనెల 14న అత్యంత దారుణమైన గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. పెనాల్టీ ఛార్జీ తగ్గింపు దాదాపు ఐదో వంతు కంటే తక్కువగా ఉంటుంది. ఈపీఎఫ్, ఈడీఎల్ఐ కంట్రిబ్యూషన్ చెల్లింపులో యజమాని విఫలమైతే (డిఫాల్ట్) లేదా ఈపీఎఫ్ చట్టం, 1952 లేదా ఈ చట్టం కింద రూపొందించబడిన పథకాల ప్రకారం చెల్లించాల్సిన ఏవైనా ఛార్జీల చెల్లింపులో డిఫాల్ట్ చేసినట్టయితే పెనాల్టీ విధించే విధానం ద్వారా ఈపీఎఫ్ఓ అదే డబ్బును రికవరీ చేయవచ్చు. ప్రస్తుతానికి, రెండు నెలల కంటే తక్కువ డిఫాల్ట్ కాలానికి సంవత్సరానికి 5 శాతం చొప్పున జరిమానా ఛార్జీలు లెక్కించబడ్డాయి.
ఇప్పుడు, సంబంధిత కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ శనివారం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా.. అన్ని నష్టాల రేటును నెలకు ఒక శాతానికి తగ్గించింది. అంటే అన్ని పథకాలకు బోర్డు అంతటా సంవత్సరానికి 12 శాతం. ఇప్పటికే కష్టపడి సంపాదించిన వేతనాలను కోల్పోతున్న మన శ్రామిక ప్రజల జీవన సౌలభ్యం కోసం సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించటం పేరుతో ఇది స్పష్టంగా జరిగింది. దాదాపు 48.79 కోట్ల మంది ఉద్యోగులలో ఈపీఎఫ్ లేదా పెన్షన్ కోసం అర్హులైన వారిలో కేవలం 11.8 కోట్ల మంది కార్మికులు మాత్రమే ఈపీఎఫ్ కింద కవర్ చేయబడతారు. ఈపీఎఫ్ పథకం కింద కవరేజీలో ఉన్నవారు యజమానులచే డిఫాల్ట్ను ప్రోత్సహిం చడం ద్వారా మరింత ఒత్తిడికి గురవుతారు. దీంతో ఉద్దేశపూర్వక డిఫాల్ట్కు జరిమానాను భారీగా తగ్గించడం ద్వారా ఈపీఎఫ్లో కార్మికుల స్వంత జీవితకాల పొదుపులను యజమానులు అనధికారి కంగా ఉపయోగించుకోవటానికి అనుమతించారు.
అంతేకాకుండా, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, 1995లోని పేరా 5, ఈడీఎల్ఐ స్కీమ్, 1976 లోని పేరా 8ఎలు మాత్రమే అటువంటి డిఫాల్ట్ లకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలు. ఈ కార్మిక వ్యతిరేక, యాజమాన్య అనుకూల నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ సవరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మిలిటెంట్ నిరసన కార్యక్రమాలకు దిగాలని శ్రామికులకు పిలుపునిచ్చింది.