పల్లెల్లో ఇక అధికారుల పాలన.!

– సర్పంచ్ ల స్థానం లో ఎవరిని నియమిస్తారు..?
నవతెలంగాణ — తంగళ్ళపల్లి
సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్ను ఎవరికి ఇస్తారు. గ్రామాల్లో పాలనను ఎవరు కొనసాగిస్తారు… అనేక అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పంచాయతీ రాజ్ అధికారులపై ఉన్నది. అయితే వచ్చే నెల 1వ తేదీతో ఇప్పుడు ఉన్న సర్పంచ్ పదవికాలం ముగుస్తుంది. మరి మరికొన్ని రోజులు సర్పంచ్ పదవికాలాన్ని కొనసాగిస్తారా..? లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా.? అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహణ కష్టం అని భావిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఎన్నికల నిర్వహణకు కనీసం 3 నెలల సమయం కావాలంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. కానీ అంత సమయం లేకపోవడంతో ఈ సర్పంచ్ పదవి కాలాన్ని పొడిగిస్తారా.. లేక ప్రత్యేక అధికారి పాలన పెడతారా.. అనేదిస్పష్టం చేయడం లేదు ప్రభుత్వం. గ్రామాల్లో ఉన్న సమస్యలు, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తాం అని చెప్పిన 6 గ్యారెంటీలు ఎలా.? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయితీ సర్పంచ్లు మరోవైపు గ్రామ సభలు పెడితే 6 గ్యారెంటీలతో పాటు, ఇతర హామీలపై ప్రభుత్వాన్ని, అధికారు లను ఎక్కడ నిలదీస్తారో అని ఎన్నికలను వాయిదా వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. గ్రామ సర్పంచ్ల పదవికాలం ముగియడంతో గ్రామ పంచాయితీ చెక్ పవర్ ఎవరికి ఇస్తారో అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. అయితే ఎంపీడీఓతో పాటు గ్రామ కార్యదర్శికి ఇస్తారా..? లేక ఎమ్మార్వో, పంచాయతీ రాజ్ ఇంజనీర్లకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారా.. అదీకాక 4 గ్రామాలకు ఒక్క మండలస్థాయి అధికారిని ఇంచార్జిగా నియమించి వారికే చెక్ పవర్ ఇస్తారా..? అనే అంశం ఇంకా తేలాల్సి ఉంది. అయితే గతంలో 4,5 గ్రామాలకు ఒక్క మండలస్థాయి అధికారిని నియమించి గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చారు.ఈసారి కూడా గతం మాదిరిగానే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సమయానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి కూడా అదే తరహా వ్యవహరిస్తోంది అంటున్నారు సర్పంచ్లు. అసలే గ్రామాల్లో రైతులకు రైతు బంధు అమలు చేయలేదు. ఎన్నికల్లో గెలవగానే 2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం ఇప్పటివరకు దానిపై సమీక్ష జరపలేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహిస్తే గెలువం అనే భావనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రత్యేక అధికారి పాలన తేవాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 6 గ్యారెంటీలు అమలు చేసి కొన్ని పథకాలు లబ్ధిదారులకు అందించాక గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతే లాభం చేకూరుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ సర్పంచ్లు బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. అంతేకాదు గ్రామాల్లో బీఆర్ఎస్ కు బలమైన క్యాడర్ ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్కు మేలు జరుగుతుందని అంటున్నారు. అందుకే ప్రత్యేక అధికారి పాలన పెట్టి గ్రామాల్లో కొన్నైనా హామీలు అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్లాలని భావిస్తోందని సమాచారం. అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Spread the love