– శనివారం నాటికి మండల, గ్రామ వారీగా ఇందిరమ్మ ఇండ్ల పట్టాల జాబితా సిద్ధం చేయాలి
– ఇందిరమ్మ ఇండ్లు పూర్తయిన చోట లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలి
– జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
గ్రామీణ స్థాయిలో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారం బాగున్నప్పటికీ, పట్టణస్థాయిలో దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన ఎల్ ఆర్ ఎస్, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, తదితర అంశాలపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో టెలికాన్ఫరేన్స్ నిర్వహించారు. కొండమల్లేపల్లి వంటి గ్రామీణ మండలంలో గత వారం వెయ్యి ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, వారిని స్ఫూర్తిగా తీసుకొని మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో దరఖాస్తుల పరిష్కార వేగం పెంచాలని, వీటి విషయంలో నిర్లక్ష్యం చూపిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఇరిగేషన్, రెవిన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ సమన్వయంతో ఒక చోట కూర్చొని దరఖాస్తుల పరిష్కారాన్ని పూర్తి చేయాలని చెప్పారు.
2014 కు ముందు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చి బ్యాంకుల్లో మార్టి గేజ్ లో ఉండి రిలీజ్ అయిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాను మండలాలు, గ్రామాల వారిగా శనివారం లోపు తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ, మున్సిపాలిటీ వార్డుల వారిగా ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయిన చోట పారదర్శకంగా లబ్ధిదారుల గుర్తింపు పూర్తిచేయాలని, 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు.తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, వర్షాలకు దాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం వస్తే తక్షణమే టార్పాలిన్లు కప్పాలని,ఎట్టి పరిస్థితులలో వర్షానికి ధాన్యం తడవకూడదని ఈ విషయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యం లారీలో లోడ్ అయ్యే వరకు రైతులు అక్కడే ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ధరణి దరఖాస్తులను పూర్తి చేయాలని, ప్రత్యేకించి తిరుమలగిరి సాగర్ లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కింద సర్వే, సబ్ డివిజన్ రికార్డ్ వంటి పనులనుంటిని నవంబర్ 15 లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఇంచార్జ్ ఆర్డిఓ శ్రీదేవి, దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు, చండూర్ ఆర్డీవో సుబ్రహ్మణ్యం, నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, తదితరులు ఈ టెలికాన్ఫెరెన్స్ లో మాట్లాడారు.