అమెరికా రైతులకు కొత్త మార్కెట్ ఇరాన్ ఆస్తులతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు : ట్రంప్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్తో జరుగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా అత్యంత బలమైన స్థితిలో ఉండి ఇరాన్తో చర్చలు జరుపుతోందని ఆయన తెలిపారు. ఇరాన్పై అమెరికా తీసుకున్న చర్యల వల్లే ఇప్పుడు చర్చల్లో తమకు పైచేయి లభించిందని పేర్కొన్నారు. శ్వేతసౌధంలో అమెరికా రైతుల కోసం నిర్వహించిన “రోజ్ గార్డెన్ క్లబ్ డిన్నర్” కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. వాషింగ్టన్తో ఒప్పందం చేసుకునేందుకు టెహ్రాన్ ఆసక్తి చూపుతోందని ఆయన అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న ఆందోళనల కారణంగానే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ చర్యల ఫలితంగానే ఇప్పుడు చర్చల టేబుల్ వద్ద అమెరికా పూర్తి ఆధిపత్యంతో, మరింత బలమైన స్థితిలో ఉందని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ను తాము తీవ్రంగా దెబ్బతీశామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత చర్చల్లో అమెరికా ప్రయోజనాలు కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. భవిష్యత్లో ఇరాన్తో ఒప్పందం కుదిరితే అది అమెరికాకు అనుకూలంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్
ఈ సందర్భంగా అమెరికా రైతులకు సంబంధించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్గా మారబోతోందని చెప్పారు. ఇరాన్ ప్రస్తుతం ఆహార సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, ఆ దేశానికి గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను పెద్దఎత్తున ఎగుమతి చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని, ఇది అమెరికా రైతులకు భారీగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని అన్నారు. అయితే ఇరాన్కు నేరుగా నగదు ఇవ్వబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా విడుదలయ్యే ఇరాన్ నిధులను అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకే వినియోగిస్తామని తెలిపారు. దీంతో అమెరికా రైతులకు ఆదాయం పెరగడంతో పాటు ఇరాన్ ప్రజలకు అవసరమైన ఆహారం అందుతుందని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన ఆస్తులు విడుదలైనా, ఆ నిధులు అమెరికా రైతులను మరింత సంపన్నులను చేయడంతో పాటు ఇరాన్ ప్రజలకు ఆహారం అందించేందుకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం
ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా చెబుతున్నట్టు ఇరాన్ ఆస్తులను అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు వినియోగిస్తామన్న వాదన పూర్తిగా అసత్యమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన స్పందించారు. “స్తంభింపజేసిన మా ఆస్తులతో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని ఆ దేశం చెబుతోంది. కానీ మేము పండించేది మీరు నాటిన అవిశ్వాసమే. అది మా నేలలో పుట్టి పెరిగింది. అమెరికా ఎగుమతి చేసేది జన్యుమార్పిడి సోయాబీన్స్, విరిగిపోయిన హామీలు, నిరాధార వ్యాఖ్యలే” అని – ఇరాన్ స్పీకర్ మహ్మద్ బాఘర్ గలీబాఫ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హార్ముజ్ జలసంధి పరిస్థితిపై కూడా ట్రంప్ వివరణ ఇచ్చారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధి పూర్తిగా తెరిచే ఉందని, అక్కడ అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఒక్కరోజులోనే హార్ముజ్ జలసంధి గుండా సుమారు 19 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగిందని చెప్పారు. ఇది ఆ జలసంధి చరిత్రలోనే అత్యధికమని ట్రంప్ వెల్లడించారు. మొత్తంగా చూస్తే, ఇరాన్తో చర్చల్లో అమెరికా బలమైన స్థితిలో ఉందని ట్రంప్ ప్రకటిస్తుండగా, మరోవైపు తమ ఆస్తుల వినియోగంపై అమెరికా చేస్తున్న వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది.
ఇరాన్తో చర్చల్లో యూఎస్దే పైచేయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



