ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ వ్యాప్తంగా 2640మంది సంపన్నుల(గత సంవత్సరం ఈ సంఖ్య2668గా ఉంది) 10అంకెల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఒక పట్టికను తయారు చేసింది. ఈ పట్టిక ప్రకారం ప్రపంచంలోని శత సహస్ర కోటీశ్వరుల సంపద 12.2ట్రిల్లియన్ డాలర్లు (1బిల్లియన్ అంటే 100కోట్ల డాలర్లు. 1బిల్లియన్ డాలర్లు 8300 కోట్ల రూపాయలకు సమానం. 1ట్రిల్లియన్ అంటే 1000 బిల్లియన్లు. అంటే 1 ట్రిల్లియన్ 83లక్షల కోట్ల రూపాయలకు సమానం). ఇది గత సంవత్సరంలోని 12.7ట్రిల్లియన్ కంటే 500బిల్లియన్ తక్కువ. ఈ పట్టికలోని ఎలన్ మస్క్ తో సహా సగం మంది ఆస్తులు తగ్గాయి. ఎలన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేశాక తెస్లా షేర్ విలువ పడిపోవటంతో మొదటి స్థానం నుంచి రెండవ స్థానానికి దిగ జారాడు. ఎలన్ మస్క్ స్థానాన్ని విలాస వస్తువులను తయారు చేసే ఎల్ వి ఎమ్ హెచ్ కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఆక్రమించి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఒక ఫ్రెంచ్ పౌరుడు అత్యంత సంపన్నుడుగా నిలిచాడు(అయితే ప్రస్తుతం ఈయన రెండవ అత్యంత సంపన్నుడు అవటానకి కారణం ఎలన్ మస్క్ తిరిగి పుంజు కోవటమే). అనూహ్యంగా నవంబర్లో ఎలన్ మస్క్కు చెందిన తెస్లా షేర్ విలువ 17శాతం పెరిగి 28బిల్లియన్ల సంపద చేరటంతో మస్క్ సంపద 245బిల్లియన్లకు చేరింది. అలా ఆయన తిరిగి ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. శత సహస్ర కోటీశ్వరుల సంఖ్య అత్యధికంగావున్న దేశాలలో 735మందితో అమెరికా అగ్రభాగాన ఉంది. వీరి సమిష్టి సంపద విలువ 4.5ట్రిల్లియన్ డాలర్లు. హాంగ్ కాంగ్, మకావుతో కలిపి చైనా 562మందితో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. వీరి సమిష్టి సంపద విలువ 2ట్రిల్లియన్ డాలర్లు. శత సహస్ర కోటీశ్వరుల సంఖ్యలో 169మందితో భారతదేశం మూడవ స్థానాన్ని ఆక్రమించింది. వీరి సమిష్టి సంపద 675బిల్లియన్ డాలర్లు. జీవన వ్యయ సంక్షోభం కారణంగా కోట్లాది మందికి కనీస అవసరాలు కూడా తీరటం కష్టమైన స్థితిలో ప్రపంచ వ్యాప్తంగా సంపన్నుల సంపద గుట్ట లుగా పోగుపడుతోంది. 2023లో ప్రపంచం లోని 50మంది అత్యంత సంపన్నులలో 12మందిది తప్ప అందరి సంపదా పెరిగింది. అత్యున్నత స్థాయిలోని 500మంది సంపన్నులలో 77శాతం మంది సంపద పెరిగింది. వీరిలో కొందరి సంపద ఊహాతీతంగా పెరిగింది. అలెన్ మస్క్ సంపద 816బిల్లియన్ డాలర్లకు పెరిగింది. ఇది అంగోలా స్థూల జాతీయో త్పత్తి కంటే ఎక్కువ. అందరికంటే ఫేస్ బుక్ స్థాపకుడైన మార్క్ జూకర్ బర్గ్ సంపంద 184శాతం పెరిగింది. 45బిల్లియన్లు ఉన్న ఆయన సంపద 128బిల్లియన్ డాలర్లకు పెరిగింది. ఆయన స్థాపిం చిన మెటా(గతంలో ఫేస్ బుక్) కంపెనీ సంపద గత సంవత్సరం కంటే 172శాతం పెరిగింది. జూకర్ బర్గ్ సంపద కంటే వేగంగా ఇండోనేషియా కార్పొరేట్ పెట్టుబడిదారు ప్రజోగో పన్జేస్తు సంపద 7రెట్లు పెరిగింది. అత్యున్నత స్థాయిలోని 15మందిలో 15వ అత్యంత సంపన్నుడిగావున్న గౌతమ్ అదానీ సంపద 35శాతం తగ్గి 53బిల్లియన్లుగా ఉంది. తాజాగా అదానీ ర్యాంకు 23వ స్థానానికి పడిపోయింది. భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ మాత్రమే టాప్ 10మంది అత్యున్నత స్థాయి సంపన్నుల జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టు కున్నాడు. 82బిల్లియన్ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచంలో 9వ అత్యున్నత సంపన్నుడిగా ఉన్నాడు.