నవతెలంగాణ హైదరాబాద్: దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడంలో భాగాంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి రోజు ప్రవేశ పెట్టే పీఎం విశ్వకర్మ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన 18 రకాల వర్గాలకు లబ్ధి చేకూరేలా వడ్డీ రాయితీతో రుణాలను మంజూరు చేయనుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా దాదాపు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
విశ్వకర్మ పథకంలోని కొన్ని ముఖ్యాంశాలివే..
- రూ.13వేల కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని రూపకల్పన
- సర్టిఫికెట్, ఐడీ కార్డుల ఆధారంగా పీఎం విశ్వకర్మ పథకానికి ఆయా వర్గాల నుంచి అర్హులను గుర్తింపు .
- తొలి విడతలో రుణ సాయంగా 5శాతం రాయితీ వడ్డీతో రూ.లక్ష మంజూరు
- రెండో విడతలో ₹2లక్షలు
- కళాకారులు తమ నైపుణ్యాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం, టూల్కిట్ ఇన్సెంటివ్, డిజిటల్ లావాదేవీలు, మార్కెటింగ్ను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ రుణాలు మంజూరు
రుణాలకు అర్హులు వీళ్లే..
వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, కమ్మరి, ఇనుప పరికరాలు తయారు చేసేవారు, ఇంటి తాళాలు తయారీదారులు, స్వర్ణకారులు, కుమ్మరి (కుండలు తయారుచేసేవారు), విగ్రహాల తయారీదారులు (మూర్తికార్, స్టోన్ కర్వర్, స్టోన్ బ్రేకర్), చర్మకారులు (చెప్పులు తయారుచేసేవారు), తాపీ పనిచేసేవారు (రాజ్మిస్త్రీ), బాస్కెట్/మ్యాట్/బ్రూమ్ మేకర్/నారతాళ్లు చేసేవారు; సంప్రదాయ బొమ్మలు తయారుచేసేవారు, క్షురకులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు, చేప వలల తయారీదారులు.