నేడు నందమూరి తారకరామారావు 101 వ జయంతి

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలో కమ్మ సంఘం కళ్యాణ మండపంలో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ పార్టీ కన్వీనర్ నర్రా శివాజీ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో శివాజీ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి మహానటుడు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు కళ్యాణ మండపంలో భారీ కేక్ కట్ చేయడంతో పాటు రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుందని అన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండల వాసులంతా అన్నదాన కార్యక్రమానికి హాజరుకావాలని శివాజీ విజ్ఞప్తి చేశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా మండలానికి చేసిన సేవలను మరోమారు స్మరించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శివాజీ తెలిపారు.

Spread the love