– రూ. 29కే కిలో చొప్పున విక్రయానికి కేంద్రం నిర్ణయం
– మార్కెట్లో కనిపించని బియ్యం అమ్మకాలు
– సమాచారం లేదంటున్న ప్రభుత్వ శాఖలు
– ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమలుకు నోచుకోని పథకం
భారత్ బ్రాండ్ పేరిట మార్కెట్లో తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న బియ్యం నిల్వలు ఎక్కడా కనిపించడం లేదు. నిత్యావసర సరకుల ధరల పెరుగుద లతో సతమతమవుతున్న నిరుపేదలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా రూ.29కే భారత్ రైస్ పథకం తెచ్చింది. దీనిపై మీడియాలో హోరెత్తించింది. ఫిబ్రవరి మొదటి నుంచే దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే, అసలు ఈ బియ్యం గురించి రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు తెలియలేదు. అధికారులూ తమకు ఎలాంటి ఆదేశాలూ రానేలేదని అంటున్నారు. కేంద్ర మంత్రి పీయుష్గోయల్ మాత్రం ఫిబ్రవరి నుంచి భారత్ రైస్ను మార్కెట్లోకి తీసుకొచ్చామని చెబుతుండగా.. అలాంటి సమాచారమేమీ తమకు లేదని ఆదిలాబాద్ అధికారులు చెబుతుండటం గమనార్హం. రాష్ట్రమంతటా ఇదే సమస్య ఉందని తెలుస్తోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
మార్కెట్లో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటు తున్నాయి. పేద, మద్య తరగతి వర్గాలు కొనలేని.. తినలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానంతో పప్పులు, నూనెలు, చక్కెర, కూరగాయలు తదితర సరుకుల ధరలు పెరగడం మూలంగా అనేక పేద కుటుంబాలు మూడు పూటలా భోజనం చేయలేని దుస్థితి. చాలా మంది మధ్య తరగతి జనాలు సన్న బియ్యానికి అలవాటుపడ్డారు. ఇది వరకు మార్కెట్లో సన్న బియ్యం ధరలు రూ.30కిలో చొప్పున ఉండగా.. ప్రస్తుతం రూ.44 ఉంది. వీటిలో మరిం త మేలు రకం సన్న బియ్యం కిలో రూ.60కిపైగా పలుకు తోంది. దీంతో ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ఎన్నికల తరుణంలో ప్రజలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఉపశమనం పేరుతో కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో రూ.29కే కిలో చొప్పున అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నెల మొదటి వారం నుంచి మార్కెట్లో 10కిలోల చొప్పున సంచుల్లో అందుబాటులో ఉంటాయని చెప్పింది. కానీ వాస్తవ రూపంలో ఎక్కడా ఈ తరహా బియ్యం అమ్మకాలు కనిపించడం లేదు.
శాఖలకూ సమాచారం కరువే..!
భారత్ బ్రాండ్ పేరిట విక్రయించే ఈ రైస్ను జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) కేంద్రాలు, నాఫెడ్ ద్వారా విక్రయిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కానీ ఇప్పటి వరకు ఇలాంటి రైస్ నిల్వలు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకోలేదు.
జిల్లాలో నాఫెడ్ లేకపోయినా.. డీసీఎంఎస్, జిల్లా పౌరసరఫరాలు, మార్క్ఫెడ్, సహకార శాఖలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఈ శాఖలకు సైతం తాజా రైస్ అమ్మకాలపై ఎలాంటి సమాచారమూ లేదని చెబుతున్నారు.
పత్రికలు, ప్రకటనల ద్వారా మాత్రమే రూ.29కే బియ్యం విక్రయిస్తున్నట్టు తెలిసిందని.. తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులూ రాలేదని అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం పౌరసరఫరాల దుకాణాల్లో బియ్యంతో పాటు వివిధ రకాల సరుకుల విక్రయాలకు అనుమతిచ్చింది.
కానీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. తాజాగా భారత్ రైస్ అమ్మకాలపై కేంద్రం ప్రకటన చేయడంపై జనాలు ఎక్కడ అమలు జరుగుతున్నాయో తెలుసుకు నేందుకు ఆరా తీస్తున్నారు.
ఎలాంటి సమాచారం రాలేదు
కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరి ట బియ్యం విక్రయాలు చేపడుతుందనే విషయం తెలిసింది. కానీ దీనికి సంబ ంధించి మా శాఖకు ఇప్పటి వరకు ఎలా ంటి సమాచారమూ లేదు.
ప్రమోద్, డీసీఎంఎస్ మేనేజర్, ఆదిలాబాద్