ఘోర విషాదం..పడవ మునిగి 60 మంది మృతి..

నవతెలంగాణ-హైదరాబాద్ : డజన్ల కొద్దీ వలసదారులతో ఐరోపాకు బయలుదేరిన ఓ పడవ లిబియా తీరం వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 60 మందికి పైగా మరణించినట్లు ఐరాసకు చెందిన ‘ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌’ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణం తీరంలో వచ్చిన బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. తాజా ఘటన జరిగిన మధ్యధరా సముద్రంలోని ఈ మార్గంలో గతంలో కూడా పలు ప్రమాదాలు సంభవించాయి. మెరుగైన జీవితాన్ని ఆశిస్తూ చాలా మంది ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా దేశాలకు వలస వెళుతుంటారు. అలాంటి వారంతా ఈ మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు.

Spread the love