ఎల్బీనగర్‌లో విషాదం..పెండ్లి అయిన 8 నెలకే యువకుడు..

నవతెలంగాణ హైదరాబాద్: ఎల్బీనగర్ ఎన్టీఆర్ నగర్‌లో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీ ఆద్య ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి గుమ్మడి రితీష్ రెడ్డి(30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి ముందు తన కారు పార్క్ చేసి.. బిల్డింగ్‌పైకి వెళ్లి అక్కడి నుంచి దూకేశాడు. సంఘటనా స్థలంలోనే అతడు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తాను కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మృతి చెందడంతో భయపడి రితీష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఎనిమిది నెలల క్రితమే మృతుడు రితీష్ రెడ్డికి వివాహం జరిగింది. ఇంతలోనే అతడు ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతికి లోనయ్యారు.  మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రితీష్‌ రెడ్డిని వెంబడించినవారి కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Spread the love