– సామాజిక కార్యకర్త నజీర్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఒకే గ్రామపంచాయతీలో ఎన్నో ఏళ్లుగా తిష్ట వేసి విధులు నిర్వహిస్తూన్నా గ్రామపంచాయతీ కార్యదర్శులకు వెంటనే బదిలీలు చేపట్టాలని సామాజిక కార్యకర్త నజీర్ డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ జిల్లాల కలెక్టర్లకు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కు పోస్ట్ ద్వారా వినతి పత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015 వ సంవత్సరంలో జారీ చేసిన జి.ఓ. నెంబర్ 57 ప్రకారం పంచాయితి కార్యదర్శులు సొంత మండలల లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించకూడదని ఉన్నప్పటికీ విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సొంత మండలాలలో విధులు నిర్వహించడం వల్ల సంబంధిత మండల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2019లో జెపిఎస్ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలను సొంత మండలాలకు చెందిన వారిని పంచాయతీ కార్యదర్శి గా నియమించిందని పేర్కొన్నారు.వాస్తవానికి జిఓ. 57 ప్రకారం సొంత మండలానికి కాకుండా వేరే మండలంలో నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వాలని నిబంధన ఉందని తెలిపారు. అప్పటి కమిషనర్ గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత మండలానికి చెందిన వారికి పంచాయతీ కార్యదర్శుల పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. గత 2014 లో రిక్రూట్ అయిన పంచాయితి కార్యదర్శులకు, అంతకు ముందు వున్న పంచాయితి కార్యదర్శులకు కూడా సొంత మండలాల్లో పోస్టింగ్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ చేయలేదని, 2019లో భర్తీ చేసిన పోస్టులలో ఒకే మండలంలో 10 నుండి 15 మంది కార్యదర్శులు సొంత మండలానికి చెందినవారే ఉంటున్నారనిఅన్నారు. లోకల్ ఎంపిటిసి, సర్పంచ్, ఎంపిపి, జడ్పిటిసిలు వారి బంధువులే కావటం వల్ల పాలనలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.
ఏ మండంలో పంచాయితి కార్యదర్శుల పోస్ట్ ఖాళీ ఏర్పడితే ఆ స్థానానికి ఆ మండలానికి సంబంధించిన వారే లోకల్ నాయకుల సహకారంతో పోస్టింగ్ పొందుతున్నారని, ప్రస్తుతం బదిలీలు లేవని అయినా అన్ని జిల్లాలో ఎన్నో బదిలీలు జరిగాయని ఆరోపించారు. ఇప్పటికైనా విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టి పెట్టి ఒకే చోట తిష్ట వేసిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలు చేపట్టాలని, గ్రామాలలో పాలన పారదర్శకంగా, సజావుగా జరిగే విధంగాచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.