తమ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి : టీటీజీడీఏ
వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈకి వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీవో 38 ప్రకారం బదిలీలు చేపట్టాలనీ, తమ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీటీజీడీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈకి వినతిపత్రాలను టీటీజీడీఏ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బి. కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాదాల కిరణ్, కోశాధికారి ఎల్.రమేశ్, తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలో 40 శాతం వరకు బదిలీలు అమలు చేయాలనీ, తద్వారా పరిసర/పెరిఫెరీ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఎక్కువ మంది వైద్యులకు ప్రయోజనం కలుగుతుందని ఉన్నతాధికారుల దృష్టికి వారు తీసుకెళ్లారు. డీఎంఈ వైద్యుల విషయంలో ఫోకల్, నాన్-ఫోకల్ విభజన చేయకూడదనీ, డీఎంఈ వైద్యులు సంప్రదాయంగా హైదరాబాద్, నాన్-హైదరాబాద్ గానే పరిగణించబడుతున్నారని తెలిపారు. జీవో నెంబర్ 38 ప్రకారం సీనియారిటీ ఆధారంగా బదిలీలు అమలు చేసి ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. యూనియన్ల విషయంలో జీఏడీ మార్గదర్శకాల ప్రకారం గుర్తింపు, మినహాయింపులను అమలు చేసి ఎటువంటి సందిగ్ధత లేకుండా స్పష్టమైన లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బదిలీల అర్హత కాలాన్ని రెండేండ్లకు తగ్గించాలని కోరారు. బదిలీలు పూర్తయిన తరువాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని విన్నవించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిల్లో తప్పనిసరి బదిలీలు అమలు చేయడానికి ముందు అందుబాటులో ఉన్న ఖాళీలను ముందుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో, గత బదిలీల్లో ఈ వర్గాలకు బదిలీలు జరగనందున, పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.



