Friday, May 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఒమన్‌ పైనా దాడులు చేస్తా ట్రంప్‌ బెదిరింపు

ఒమన్‌ పైనా దాడులు చేస్తా ట్రంప్‌ బెదిరింపు

- Advertisement -


వాషింగ్టన్‌ : ఇరాన్‌తో కలిసి హార్ముజ్‌ జలసంధిని నియంత్రించేందుకు ఒమన్‌ ప్రయత్నిస్తే దానిపై కూడా దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఇతర దేశాల మాదిరిగానే ఒమన్‌ కూడా ప్రవర్తిస్తే దానిని తగలబెడతానని బెదిరించారు. దీంతో ట్రంప్‌ బెదిరింపులకు గురైన దేశాల సంఖ్య పదిహేనుకు చేరింది. దాడులు చేస్తాననో లేదా దాడులు చేసే అవకాశం ఉన్నదనో ట్రంప్‌ ఆయా దేశాలను బెదిరించారు. కొన్నింటిపై దాడులు చేశారు కూడా. ఈ దాడులు, బెదిరింపులు అన్నీ ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మొదటి 16 నెలల కాలంలో జరిగినవే. ట్రంప్‌ ఇప్పటి వరకూ ఏడు దేశాలపై… ఇరాన్‌, ఇరాక్‌, నైజీరియా, సోమాలియా, సిరియా, వెనిజులా, యెమన్‌..దాడులు చేశారు. వీటిలో కొన్ని దేశాలపై తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా దాడులు జరిపారు. కరేబియన్‌, పసిఫిక్‌ సముద్రాలలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నాయన్న ఆరోపణతో సుమారు 60 పడవలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 190 మంది ప్రాణాలు కోల్పోయారు.
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కెనడా, కొలంబియా, క్యూబా, గ్రీన్‌లాండ్‌, మెక్సికో, పనామా, తాజాగా ఒమన్‌పై దాడులు చేస్తానని ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచంలోని సుమారు 200 దేశాలలో పదిహేను దేశాలపై దాడులు చేస్తానని హెచ్చరించడాన్నో లేదా దాడులు చేయడాన్నో చూస్తుంటే ఆయా దేశాలలోని జనాభా రీత్యా ప్రతి 11 మందిలోనూ ఒకరిని ఆయన లక్ష్యంగా చేసుకున్నట్టు కన్పిస్తోంది. ఒక్క మధ్యప్రాచ్యంలోనే ఆయన ఐదు దేశాలపై గురి పెట్టారు. ప్రపంచంలోని ఆరు ఖండాలలో అత్యధిక జనాభా ఉన్న ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలలోని దేశాలనే ట్రంప్‌ బెదిరిస్తుండడం, వాటిపై దాడులు చేయడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -