ట్రాన్స్‌జెండర్‌ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య

నవతెలంగాణ హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్‌ వేధింపులు భరించలేక ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం భూపతిపేట పంచాయితీ పరిధిలోని కోమటిపల్లి తండాలో మంగళవారం చేటుచేసుకుంది. గూడూరు సీఐ ఫణీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ధరావత్‌ శివరాం(26), వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ కొర్ర ప్రవీణ్‌ అలియాస్‌ తపస్వీ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. విభేదాలు రావడంతో కొద్ది రోజులకే విడిపోయారు. కాగా శివరామ్‌కు తన తల్లి నీలమ్మ ఇటీవల పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒకమ్మాయితో పెండ్లి చూపులు, మాట మంతి అన్ని అయ్యాయి. పెట్టుకున్నారు.
ఆ విషయం తెలుసుకున్న ట్రాన్స్‌జెండర్‌ తపస్వీ అమ్మాయి తరఫు వాళ్లకు ఫోన్‌ చేసి శివరాం నేను గతంలో పెండ్లి చేసుకున్నాం. మళ్లీ అతడికి మీ అమ్మాయితో ఎలా పెండ్లి చేస్తారని ప్రశ్నించింది. అంతేకాకుండా శివరామ్‌కు సోమవారం రాత్రి తపస్సి ఫోన్‌చేసి ‘నువ్వు వేరే అమ్మాయిని ఎలా పెండ్లి చేసుకుంటావు. నీ సంగతి చూస్తా. మరో పెండ్లి చేసుకుంటే నువ్వైనా బతికుండాలి లేదంటూ నేనైనా బతికుండాలి’ అంటూ బెదిరించింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శివరాం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. తన కొడుకు మృతికి కారణమైన ట్రాన్స్‌జెండర్‌ తపస్వీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి నీలమ్మ పోలీసులను ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ఫణీందర్‌ తెలిపారు.

Spread the love