– అమిత్షాపై ప్రియాంక మండిపాటు
న్యూఢిల్లీ : ఎన్నికల్లో మాత్రమే గాంధీ కుటుంబసభ్యులు అమేథి, రాయబరేలి నియోజకవర్గాల్లో పర్యటిస్తారంటూ కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్షా ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాకం గాంధీ వాద్రా ఘాటుగా విమర్శించారు. ఆయన వాదన సత్యదూరమని అన్నారు. మహిళల కార్యకలాపాలపై అమిత్షా నిఘా వేయడం ఏమిటని నిలదీశారు. థాయ్ లాండ్లో తాను పర్యటించిన సమాచారాన్ని ఆయన ఎలా సేకరించారని ప్రశ్నించారు.
తిప్పికొట్టిన ప్రియాంక..
హోం మంత్రి ఆరోపణల్లో నిజం ఏమాత్రం లేదని, మహిళల కార్యకలాపాలపై ఆయన నిఘా వేస్తుంటారని ఆరోపించారు. ”ముఖ్యంగా మహిళలతో సహా ఎవరు ఏం చేస్తున్నారు? ఎప్పుడు, ఎక్కడ ఉన్నారు? అనే దానిపై ఆయన దృష్టి సారిస్తుంటారు. నేను కొద్ది రోజుల క్రితం నా కుమార్తెను చూసేందుకు థారులాండ్ వెళ్లాను. ఎన్నికల మీటింగ్లో ఆయన (అమిత్షా) ఈ ప్రస్తావన చేశారు. అవును…నేను థారులాండ్ వెళ్లాను. అయితే ఈ సమాచారం ఆయనకు ఎవరు ఇచ్చారో చెప్పగలరా? ఆయన దగ్గర సమాచారం ఉన్ననప్పుడు అబద్ధాలు చెప్పాల్సిన పనేంటి?” అని ప్రియాంక నిలదీశారు.
కాంగ్రెస్ చాలా చేసింది
కాంగ్రెస్ హయాంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినట్టు ప్రియాంక తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గంగా బ్రిడ్జి, ఎయిమ్స్, నిఫ్ట్, ఎఫ్డీడీఐ, లక్నో నుంచి రాయబేరిలికి 4 లేన్ రింగ్ రోడ్డు, ఐదు నేషనల్ హైవేలు ఇచ్చిందన్నారు. మోటార్ డ్రైవింగ్ స్కూలు తాము ప్రారంభిస్తే వాళ్లు మూసేశారని చెప్పారు. స్పైస్ పార్క్, ఎయిమ్స్ ప్రారంభిస్తే దానిని కూడా వారు మూసివేయించారని చెప్పారు. 8 ఫ్లైఓవర్లు, కోవిడ్ మహమ్మారి సమయంలో ఎంపీలాడ్స్ ద్వారా సాయం, రైల్వే వాషింగ్ లైన్, రైల్వేస్టేషన్ల మాడిఫికేషన్, 10 రైల్వే అండర్పాస్, కేంద్ర నిధులతో రాయబేరి నుంచి డల్మవు వరకూ రోడ్డు నిర్మాణం వంటివి తాము చేపట్టామని చెప్పారు. రాబయరేలికి బీజేపీ ఏమి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కాగా, ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అమేథీ, రాయబరేలిలో ఎన్నికల ప్రచారానికి ప్రియాంక గాంధీ సారథ్యం వహిస్తున్నారు. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మే 20న రాయబరేలిలో పోలింగ్ జరుగనుంది.
అసత్యాల విషం
దేశం పురోగమిస్తోందని, ఆర్ధిక వ్యవస్ధ బలోపేతమైందని వార్తా చానెల్స్ ఊదరగొడుతున్నాయని ప్రియాంక గాంధీ అన్నారు. సంతోషంగా ఉన్న రైతులను టీవీల్లో చూపిస్తున్నారు..కాంగ్రెస్ 70 ఏండ్లలో చేయలేని పనులను ప్రధాని మోడీ పదేండ్లలో చేసి చూపారని చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.
ఈ టీవీ ఛానెల్స్ అన్నీ బిలియనీర్లకు చెందినవని, వీటిని ఈ పదేండ్లలో కాషాయ పాలకులు కొనేశారని ప్రియాంక దుయ్యబట్టారు. మీరు వాస్తవాలను ఎక్కడా చూడలేరని, సత్యం అనేది మన జీవితాలనే ప్రతిబింబిస్తుందని, మోడీ హయాంలో మీలో ఏ ఒక్కరూ పురోగతి సాధించలేదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.