– 15రోజుల వ్యవధిలో పాక్తో మూడుసార్లు?
ముంబయి: క్రికెట్ అభిమానులను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచుల్లో భారత్-పాకిస్తన్ జట్ల మధ్య జరిగే సంగ్రామం ఒకటి. ఇది ఉత్కంఠ ఏ క్రీడాంశంలో ఉన్నా.. క్రికెట్కు ఉండే మజానే వేరు. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే మ్యాచులకు వచ్చే వ్యూయర్షిప్, ప్రేక్షకుల సంఖ్య చూస్తేనే ఈ విషయం స్పష్టం అవుతుంది. ఈ మ్యాచులకు వ్యూయర్షిప్ రికార్డులన్నీ బద్దలైపోతూ ఉంటాయి. అయితే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఈ రెండు టీమ్స్ తలపడటం చాలా అరుదుగానే జరుగుతోంది. అయితే ఇలా రేర్గా ఈ మ్యాచులు జరగడం వల్ల వీటిపై హైప్ కూడా అదే రేంజ్లో పెరుగుతోంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే జరిగే ఈ మ్యాచులను మిస్ అవడానికి ఫ్యాన్స్ ఏమాత్రం ఇష్టపడటం లేదు. అలాంటి ఫ్యాన్స్ అందరికీ ఈ ఏడాది మంచి బంపరాఫర్ తగిలినట్లే. ఎందుకంటే ఈ ఏడాది కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఈ మ్యాచులు కూడా ప్రపంచ కప్కు ముందే జరగడం గమనార్హం. ఆగస్టు 30నుంచి ఆసియా కప్ మొదలుకానుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ రెండు టీమ్స్ కూడా ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ మైదానంలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య తొలి లీగ్ మ్యాచ్ జరగుతుంది. ఇక ఈ గ్రూప్లో ఉన్న మరో జట్టు నేపాల్. కాబట్టి భారత్, పాకిస్తాన్ టాప్-2లో నిలవడం ఖాయం. అందువల్ల ఈ రెండు జట్లు మరోసారి సూపర్-4 దశలో ఢకొీట్టడం కూడా గ్యారంటీనే. అంతేకాదు, ప్రస్తుతం అన్ని టీమ్స్ ఫామ్ చూసుకుంటే సూపర్-4 దశలో కూడా భారత్, పాకిస్తాన్ టాప్లో నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ప్రస్తుతం ఫామ్లో లేవు. గ్రూప్-బిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వచ్చినా ఈ రెండు జట్లకు ఢోకా లేదు. అంటే సూపర్-4లో కూడా భారత్, పాకిస్తాన్ టాప్ టీమ్స్గా నిలవొచ్చు. అప్పుడు ఈ రెండు టీమ్స్ ఫైనల్లో ట్రోఫీ కోసం మరోసారి తలపడతాయి.