ఎన్నికల బడ్జెట్టేనా?

– క్యాబినెట్‌ భేటీలో మంతనాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులతో ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో కీలక శాఖలకు సంబంధించిన కేటాయింపులు, బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ నెల 31న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌ 2023-24ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందుకు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌ కూడా ఇదే.
పునర్‌వ్యవస్థీకరణపైనా చర్చ !
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులకు కసరత్తు జరుగుతోందన్న కథనాల నేపథ్యంలో మోడీ కేంద్ర మంత్రులతో సమావేశమవ్వడం అనేక చర్చలకు తెర లేపింది. కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నేతలకు కేబినెట్‌ పదవులు కట్టబెడితే ఎన్నికల్లో ప్రభావితం చేయవచ్చునన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో నాలుగు ప్రధాన శాఖలు మినహా క్యాబినెట్‌ మొత్తాన్ని పునర్‌వ్యవస్థీకరించే అవకాశముందని వినిపిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి ప్రస్తుతమున్న కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డిని కొనసాగిస్తూనే మరొకరికి అవకాశమివ్వాలని బీజేపీ అధినాయకత్వం యోచిస్తోందని సమాచారం. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన లక్షణ్‌ ఈ రేసులో ముందుండగా, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు తీసుకొంటే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Spread the love