భారత్‌ కంటి చుక్కల మందుతో అమెరికాలో ఒకరు మృతి

– ఐదుగురికి చూపు గల్లంతు
వాషింగ్టన్‌: భారత్‌కు చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ తయారు చేసిన ఎజ్రీకేర్‌ కంటి చుక్కల మందు కారణంగా అమెరికాలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు కంటి చూపు కోల్పోయారు. పలువురికి కంటి చూపు మందగించింది. దీంతో అమెరికా ప్రభుత్వం ఈ మందుపై ఆంక్షలు విధించింది. అమెరికా మార్కెట్‌ నుంచి ఈ మందును రీకాల్‌ చేసుకుంటున్నట్లు భారత కంపెనీ వెల్లడించింది. ఎజ్రీకేర్‌ కంటి చుక్కల మందు కారణంగా 12 రాష్ట్రాల్లో కనీసం 55 మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని అమెరికా అధికారులు ఇటీవల తమ ప్రజలను హెచ్చరించారు. ఇందులో ఒకరు ఇన్ఫెక్షన్‌ కారణంగా మరణించారని, మరో ఐదుగురికి కంటిచూపు పోయిందని అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అధికార ప్రతినిధి చెప్పారు. ‘న్యూయార్క్‌, వాషింగ్టన్‌తోపాటు మరో 10రాష్ట్రాల్లో పలువురు కంటి చుక్కలు వేసుకున్న తర్వాత బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ఫెక్షన్‌ కనిపించింది’ అని సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎజ్రికేర్‌, డెల్సామ్‌ కంటి చుక్కల కొనుగోళ్లు, వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తమ వైద్యులు, వినియోగదారులను హెచ్చరించింది.

Spread the love