25 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి

25 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి– సిద్దిపేటలో బడిబాట కార్యక్రమంలో
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు
నవతెలంగాణ-సిద్దిపేట
సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట ప్రభుత్వ హైస్కూల్‌లో బుధవారం బడి బాటలో భాగంగా విద్యార్థులకు బుక్స్‌, యూనిఫామ్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో ఐదేండ్ల నుంచి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా సెకండ్‌ ప్లస్‌లో ఉందన్నారు. కార్పొరేట్‌ పాఠశాలను తలదన్నెలా సిద్దిపేటలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. సీఎం చెప్పిన విధంగా, ప్రభుత్వ పాఠశాలకు ఉచిత కరెంట్‌, పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్‌ ఔట్‌ తగ్గించాలన్నారు. సొంత డబ్బులతో విద్యార్థులకు స్నాక్స్‌ పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ పయ్యావుల పూర్ణిమ ఎల్లం, బీఆర్‌ఎస్‌ నాయకులు రాజనర్సు, మండల విద్యాధికారి యాదవ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Spread the love