నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి నెల రోజులవుతున్నా ఇంకా 52 మృతదేహాలను గుర్తించలేదు. ఎయిమ్స్ భువనేశ్వర్లో భద్రపరిచిన ఈ మృతదేహాల కోసం ఎవరూ ముందుకు రావడం లేదు. జూన్ 2న బాలాసోర్ సమీపంలో లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దాని బోగీలు మెయిన్ లైన్పై పడగా హౌరా వెళ్తున్న షాలిమార్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 291 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. మూడు రైళ్ల ప్రమాదంపై రైల్వే కమిటీతోపాటు సీబీఐ కూడా దర్యాప్తు చేస్తున్నది. కాగా, ప్రమాదం తర్వాత వందలాది మృతదేహాలను భువనేశ్వర్లోని ఎయిమ్స్కు తరలించారు. వాటిలో 81 మృతదేహాలు ఇంకా అక్కడ ఉన్నాయి. మృతదేహాలు తమ వారివే అని పలువురు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. చనిపోయిన వారిని గుర్తించేందుకు ఆయా నమూనాలను డీఎన్ఏ పరీక్ష కోసం ఢిల్లీ పంపారు. మరోవైపు 29 నమూనాలకు సంబంధించిన డీఎన్ఏ రిపోర్టులు అందినట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సులోచనా దాస్ శుక్రవారం తెలిపారు. దీంతో మృతుల బంధువులకు ఈ సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. మూడు రైళ్ల ప్రమాదంలో మరణించిన 291 మందిలో 52 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించారు.