గణాంకాల సేకరణలో బీఎల్వోలు జాగ్రత్తగా ఉండాలి
రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి
గణన ప్రక్రియపై ఈసీఐ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్
సర్-2026 ఓటర్ల మ్యాపింగ్ తెలంగాణలో 68.30 శాతం పూర్తయిందని రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సర్పై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్, ఉప కార్యదర్శి సంజయ్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, సర్ కోసం కేటాయించిన ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బీఎల్ఓ, సూపర్వైజర్ల పని విభజన, సహాయ కేంద్రాల ఏర్పాటు గురించి సమావేశంలో చర్చించారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తితే పై అధికారుల దృష్టికి తీసుకు పోవాలని సూచించారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియపై ఈసీఐ అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలు, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950, ఓటర్ల నమోదు నియమావళి 1960 వంటి అంశాలను వివరించారు. గణన దశ (ఆన్లైన్/ఆఫ్లైన్), ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ, ఫిర్యాదులు, అభ్యంతరాల దాఖలు, పరిష్కారం, నోటీసుల జారీ తుది జాబితా ప్రచురణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అధికారిక పోర్టల్ (voters.eci.gov.in) ద్వారా గణన పత్రాలను ఆన్లైన్లో సమర్పించడం గురించి, అలాగే ఓటర్లు ఎస్ఐఆర్ గురించి త్వరితగతిన సమాచారం పొందడానికి సహాయపడే “బుక్ ఎ కాల్” సదుపాయం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎన్నికల అధికారులు క్రమం తప్పకుండా అఖిల పక్ష సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇంటరాక్టివ్ సెషన్లో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు లేవనెత్తిన సాంకేతిక, పరిపాలనాపరమైన సందేహాలను ఈసీఐ బృందం నివృత్తి చేసింది. ఈ సమీక్షా సమావేశానికి అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వరరెడ్డి, జాయింట్ సీఈవో ఎం.సత్యవాణి, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ. కర్ణన్, మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి ఎం. మను చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 68.30 శాతం సర్ మ్యాపింగ్ పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



