– గిగ్ కార్మికుల్లో కొనసాగుతున్న వేతన అంతరాలు
ముంబయి : దేశంలో గిగ్ కార్మికులు వేతన అంతరాలుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా, దీపావళి వంటి పండుగల సందర్భంగా గిగ్ కార్మికుల నియామకాలు భారీగా పెరిగినా వారి వేతనాలు మాత్రం పెరగడం లేదు. ఇతర శాశ్వత ఉద్యోగులుతో పోలిస్తే తీవ్ర వేతన వ్యత్యాసాలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని జీనియస్ హెచ్ఆర్టెక్ (గతంలో జీనియస్ కన్సల్టెంట్స్) నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ చేసిన ఒక సర్వే ప్రకారం గిగ్ ఉద్యోగుల్లో దాదాపు 47 శాత మంది తాము సమాన పని-సమాన వేతనానికి దూరంగా ఉన్నామని చెప్పారు. సెప్టెంబరు 1 నుంచి 30 తేదీవరకూ 1,550 మంది గిగ్ కార్మికులపై ఈ సర్వే చేశారు. వర్క్ఫోర్స్ స్టాఫింగ్ సర్వీసెస్ అండ్ హెచ్ఆర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. ‘గిగ్ కార్మికుల కృషి, సహకారంతో పండుగ విక్రయాలు జోరుగా వృద్ధి చెందాయి. అయినప్పటికీ గిగ్ వర్కర్లు వేతన అంతరాలతో పని చేస్తున్నారు. ‘సమాన పనికి సమాన వేతనం’ అనే సూత్రం ఇంకా వారికి అమలుకావడం లేదు’ అని నివేదిక తెలిపింది. దేశంలో ఉన్న డిమాండ్కు అనుగుణంగా గిగ్ కార్మికులు వృద్ధి చెందుతున్నా.. వారికి నైపుణ్యాభివృద్ధితో పాటు సరైన పరిహారం, పారదర్శకత కూడా చాలా కీలమని హెచ్ఆర్టెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పి యాదవ్ తెలిపారు. యజమానుల్లో దీర్ఘ కాలిక ప్రయోజనాలు, బాధ్యతలపై దృష్టి లేకపోవడమే గిగ్ కార్మికుల్లో వేతన అంతరాలకు కారణమని చెప్పారు. అలాగే ఈ సర్వే ప్రకారం గిగ్ కార్మికులు నైపుణ్యాభివృద్ధికి కార్యక్రమాలతో పాటు, సౌకర్యవంతమైన షిఫ్ట్లను కూడా కోరుకుంటున్నారని వెల్లడయింది. అదేవిధంగా రవాణా, భోజన సౌకర్యాలు, శాశ్వత ఉపాధిని కూడా కోరుకుంటున్నారు.
సమాన పని – అసమాన వేతనాలు
- Advertisement -
- Advertisement -



